హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట: సిద్దిపేట స్వచ్ఛబడికి అరుదైన గౌరవం లభించింది. సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో 4 మార్కులతో ఒక వ్యాసరూపంలో స్వచ్ఛబడిపై ప్రశ్న వచ్చింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛబడి మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? అన్నది మొదటి ప్రశ్న కాగా, రెండోసారి స్వచ్ఛబడి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో అవునా.. కాదా? అని ప్రశ్న వచ్చింది. స్వచ్ఛబడి తొలిసారి బెంగళూరులో ప్రారంభం కాగా, రెండొవది సిద్దిపేట అన్నది కరెక్ట్ సమాధానం. రాష్ట్రంలోని లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు సిద్దిపేట స్వచ్ఛబడి ప్రశ్న ఒక స్ఫూర్తిని ఇచ్చింది. ఇంటర్ బోర్డు పరీక్ష పత్రంలో సిద్దిపేట స్వచ్ఛబడికి చోటు దక్కడం సంతోషంగా ఉన్నదని, ఈ విషయం మాకు, మా సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ప్రజలకు గర్వకారణమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాగా ఈ పరీక్షకు 4,41,374 (95 శాతం) విద్యార్థులు హాజరుకాగా, 23,311 (5 శాతం) మంది హాజరు కాలేదు. నిజాబాబాద్ జిల్లాలో కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థిని అధికారులు డిబార్చేశారు.
సూర్యాపేటలో ఇంటర్ పరీక్ష గంట ఆలస్యం
సూర్యాపేటలో ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షను సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఒక బండిల్లో ప్రింటింగ్ పొరపాటును గమనించామని, సమీపంలోని కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలు తెప్పించడం వల్ల గంట ఆలస్యమైందని పేర్కొన్నారు. విద్యార్థులకు మూడు గంటలపాటు పరీక్ష రాసే అవకాశం కల్పించామని వెల్లడించారు.