హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి, దుడ్యాలలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ధావలాపూర్లో 9, మదనపల్లి, ధరూర్, పుట్టపహాడ్, యాలాల్ మండలం తాండూర్(ఏ), రంగారెడ్డి జిల్లా కాసులబాద్లో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. గత 24 గంటల్లో సుమారు 22 జిల్లాల్లో వర్షం కురిసింది. శనివారం ఉదయం వరకు కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుఫాన్గా కదులుతున్నదని, దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలపడిన తరువాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో 40 డిగ్రీలపైన నమోదు కాగా, ఆరు జిల్లాల్లో 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 30 డిగ్రీలపైన నమోదయ్యాయి.