వనపర్తి, మే 28(నమస్తే తెలంగాణ): సురవరం ప్రతాపరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖ విశ్లేషకుడు, తెలంగాణ ఉద్యమకారుడు వీ ప్రకాశ్ పిలుపునిచ్చారు. తొలి ఆంధ్ర మ హాసభకు సారథ్యం వహించిన సురవరం.. ఆ సభలో బాల్యవివాహాలు నిరోధించాలని, అంటరానితనాన్ని రూపుమాపాలని, వితంతువులకు పునర్వివాహం జరిపించాలన్న తీర్మానాలను ప్రవేశపెట్టారని ఈ సం దర్భంగా ఆయన గుర్తుచేశారు. గురువారం వనపర్తి జిల్లాకేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరులో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు పల్లెలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని ఆనందం వ్యక్తంచేశారు.
సురవరం ప్రతాపరెడ్డి చరిత్రను నవ సమాజానికి అందించేందుకు వనపర్తిలో 30ఏండ్ల నుంచి కృషి జరుగుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని నిరుడు ఆలోచన చేశామని గుర్తుచేశారు. సమాజంపై ఆయనకు ఎప్పుడూ సంఘర్షణ ఉండేదని, వచనం, కావ్యం, గేయం, పద్యం వంటివి కోకొల్లలుగా రాస్తూ గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారని గుర్తుచేశారు. తెలంగాణలో కవులు లేరన్న ఒక్కమాటకు 355 మంది కవులను ఏకతాటిపైకి తెచ్చి ఆంధ్రా నాయకుల కండ్లు తెరిపించిన గొ ప్ప ధీశాలి సురవరం ప్రతాపరెడ్డి అని ఆయన కొనియాడారు.
తాము చదువుకునే రోజుల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సురవరం ప్రతాపరెడ్డి వంటి మహోన్నతుడి విశేషాలు తెలియపర్చలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొ న్నారు. సురవరం ప్రతాపరెడ్డికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ జీవితాలు ఒకేలా అణచివేతకు గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యే దాస్యం ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అనే పదం మాట్లాడితేనే అవహేళన చేసిన చరిత్ర ఉన్న సమైక్య రాష్ట్రంలో సురవరం వంటి తెలంగాణ ముఖ్యుల చరిత్ర మరుగున పడిందని ఆయన వాపోయారు. గోల్కొండ పత్రికను కుట్రతోనే తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానివ్వలేదని, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వచ్చే వరకు మనకు ఓ పత్రిక కూడా లేదని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న సురవరం కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.