హిమాయత్నగర్, ఆగస్టు 21 : ఆదివాసీ మహిళా మాజీ మావోయిస్టులతో ర్యాంప్వాక్ చేయించిన ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, చైతన్య మహిళా సంఘం నాయకురాలు బీ జ్యోతి, పీడీఎం నేత రాజు మాట్లాడుతూ.. మాజీ మావోయిస్టులకు టైలరింగ్లో శిక్షణ ఇప్పిస్తామని నమ్మబలికి సుక్మాజిల్లా పోలీస్ హెడ్క్వార్టర్ నుంచి రాయపూర్కు తీసుకెళ్లి ర్యాంప్వాక్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా తాము చెప్పినట్టు వినకపోతే మీ జీవితాలను ఛిద్రం చేస్తామని బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
అమాయకపు ఆదివాసీల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు పాలసీ ప్రకారం ఇవ్వాల్సిన రివార్డులు, సౌకర్యాలను కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకోవాలని, పలు రాష్ర్టాల్లో అక్రమంగా నిర్బంధించిన మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు రాంబాబు, నాగభూషణం, జక్కుల వెంకటయ్య, భవాని, శ్రీహరి, ఆజాద్, మమత, అశోక్, కొప్పుల గీత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.