హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రవాణా రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిషరించి, ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ జేఏసీ కోరింది. గురువారం హైదరాబాద్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కలిసిన జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
సుమారు 15 లక్షల మంది రవాణా రంగంపై ఆధారపడ్డారని, వారి భద్రత దృష్ట్యా ప్రభుత్వం చొరవ తీసుకొని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని కోరారు. క్యాబ్ డ్రైవర్లకు ముఖ్యంగా ఫైనాన్సర్లతో, ఓలా, ఊబర్ యాజమాన్యాలతో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వారి దోపిడీ నుంచి రక్షించేందుకు 15% కమీషన్తో కొత్త యాప్ను రూపొందించాలని సూచించారు.