Summer Holidays | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ ): ఏడాదిపాటు తరగతులు, హోంవర్క్లు, ట్యూషన్లు, పరీక్షలతో సతమతమైన పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు షురూ కానున్నాయి. రాష్ట్రంలో బడులకు సోమవారమే ఆఖరి రోజు. మంగళవారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సోమవారం పేరెంట్, టీచర్ సమావేశాలు జరుగుతాయి. ఇదేరోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. గత రెండేండ్లు కరోనా కల్లోలంతో విద్యా సంవత్సరానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఒమిక్రాన్ ఆందోళనలు వ్యక్తమైనా.. దాని ప్రభావం అంతగా లేకపోవడంతో విద్యాసంవత్సరం సజావుగానే ముగిసింది. ఈ వేసవిలో 48 రోజుల పాటు బాలలు సెలవుల్లో మునిగి తేలనున్నారు. ఇన్నిరోజుల దినచర్యకు భిన్నంగా వారికి ఈ సెలవుల్లో వెసులుబాటు కలుగుతుంది. ఈ సెలవులను బాలలు మరుపురాని అనుభూతులుగా మార్చుకోవచ్చు.
బడుల్లో కేవలం చదువుకే ప్రాధాన్యమివ్వడం పరిపాటి. ఈ రోజుల్లో కనీసం క్రీడల్లోనూ పిల్లలకు ప్రావీణ్యం లేకుండా పోతుంది. కానీ ఈ వేసవిలో తమకిష్టమైన ఆటల్లో శిక్షణ పొంది ప్రావీణ్యం సంపాదించవచ్చు. ఇష్టమైన ఇతర రంగాల్లో శిక్షణ పొందవచ్చు. భావి వికాసానికి అవసరమైన ఎన్నో అంశాలపై వారి దృష్టి మళ్లించేలా చేయొచ్చు. పైచదువుల్లో ప్రాథమిక అవగాహన కోసం కోచింగ్ ఇప్పించవచ్చు. ఇలా బాలల వికాసానికి దోహదపడే అంశాలను వారికి పరిచయం చేయవచ్చు.
ఈ రోజుల్లో ప్రతి ఇంటా సెల్ఫోన్ ఫోబియా పట్టి పీడిస్తున్నది. ఈ సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్ ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. పత్రికలు, పుస్తక పఠనం వైపు దారి మళ్లించాలి. గ్రంథాలయాలను వారికి పరిచయం చేయడమే కాదు అలవాటుగా మలచాలి. బంధుత్వాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను నేర్పించాలి. క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవ వికాసం వైపు మళ్లేలా వారికి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే శిక్షణను ఇప్పించాలి. చేతిరాత శిక్షణ ఇప్పించి భవిష్యత్తు రాతను వారితోనే గీయించాలి.
సెలవుల అనంతరం బడులు జూన్ 12న తెరుచుకుంటాయి. జూన్ మొదటివారం నుంచే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచే బడులు తెరుచుకోనుండగా, విద్యాసంవత్సరం మాత్రం జూన్ 12 నుంచే ప్రారంభంకానుంది. ఈ సెలవు రోజుల్లో మన ఊరు – మన బడి, మన బస్తీ కార్యక్రమ పనులను శరవేగంగా పూర్తిచేయాలని, మరమ్మతులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.