హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఇంగ్లిష్లోనే అభ్యసించిన ఇంజనీరింగ్ విద్య ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. ఇంటర్ వరకు తెలుగులో చదివి ఇంజినీరింగ్లో ఇంగ్లిష్తో కుస్తీపట్టలేక ఇబ్బందిపడే విద్యార్థులకు కష్టాలు తీరినట్టే. జాతీయ విద్యా పాలసీ-2020 ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అందులో భాగంగా అండర్ గ్రాడ్యుయేషన్, డిప్లోమా కోర్సులను ఇకపై ప్రాంతీయ భాషల్లో బోధించాలని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రణాళికలు రూపొందించింది. తెలుగు, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం మొత్తం ఎనిమిది ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యాబోధనకు అనుమతిచ్చింది. ప్రస్తుతానికి అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్, అందులోనూ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇతర సంప్రదాయ కోర్సులను ప్రాంతీయ భాషలో అభ్యసించే అవకాశాన్ని కల్పించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాంతీయభాషను అమలుచేయనున్నారు. భవిష్యత్లో మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ సాంకేతిక విద్యను అందించనున్నట్టు ఏఐసీటీఈ ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించే కళాశాల కచ్చితంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ పొందడమే గాక, ఆయా రాష్ర్టాల్లో బోధనలో అగ్రస్థానంలో ఉండాలి. మెరుగైన ప్రమాణాలను కలిగిన, స్వయంప్రతిపత్తి సంస్థలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఒక్కో విభాగంలో బ్యాచ్కు 30-60మంది విద్యార్థులతోనే కోర్సు ప్రారంభించాలి. మాతృభాషలో బోధించేందుకు దేశవ్యాప్తంగా 500 కళాశాలలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోగా తెలంగాణ, ఏపీ నుంచి 50 కిపైగా కళాశాలలు దరఖాస్తు చేశాయి.