బాసర, జూన్ 13: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక(17) క్యాంపస్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం పీయూసీ-2 వార్షిక పరీక్ష రాసిన అనంతరం బాత్రూంకి వెళ్లిన దీపిక చాలా సేపటికి వరకు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది చూసే సరికి చున్నీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపస్మారకస్థితిలో ఉంది. వెంటనే క్యాంపస్లోని హెల్త్సెంటర్లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ దీపికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీపిక సొంతూరు సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి. విద్యార్థిని మృతిపై ఆర్జీయూకేటీ బాసర వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్, అధ్యాపకులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.