హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థను రద్దు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గురుకులాలను డే స్కాలర్స్గా మార్చేందుకు అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకొన్నట్టు గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.
గురుకులాల రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అధికారమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిశోర్గౌడ్ హెచ్చరించారు. రేవంత్ గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడం, వసతిగృహాల్లో పలుమార్లు కలుషిత ఆహార ఘటనలు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో.. నేడు పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకుల వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.