ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ద్రోహుల విగ్రహాలను కూలగొడుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హెచ్చరించారు. తెలంగాణ సాంస్కృతిక, జానపద కళలకు కేంద్రమైన రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును ఖండించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులుయాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ఆంధ్రాప్రాంతం వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటుచేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విముక్తి కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించి, పోరాడిన మేధావులు, కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ఎందుకు ప్రతిష్టించడంలేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.
రవీంద్రభారతి ఆవరణలో గద్దర్, అందెశ్రీ, గూడ అంజయ్య, సంగంరెడ్డి సత్యనారాయణ, శ్రీకాంతాచారి, బెల్లి లలిత, ప్రభాకర్రెడ్డి తదితరుల విగ్రహాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతరుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో మిలియన్ మార్చ్ మాదిరిగా ఓయూ విద్యార్థుల మార్చ్ నిర్వహించి ద్రోహుల విగ్రహాలను కూలుస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా మళ్లీ ఆధిపత్యం చెలాయించేందుకు, తెలంగాణను దోచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఏర్పాటుచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయడం ద్రోహమని విమర్శించారు. సమావేశంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పల్లె ఆంజనేయులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మహేశ్గౌడ్, మీసాల మహేశ్, నూకల మధు, చిందం మధు, అశ్వన్, నరేశ్గౌడ్, కంబాలపల్లి మహేశ్, నగేశ్, శివ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.