స్టేషన్ఘన్పూర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాంగ్రెస్లోకి వస్తే అడ్డుకుంటామని నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్చార్జులు హెచ్చరించారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్చందర్రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడుసార్లు ఓడిపోయిన రాజయ్యపై జాలిపడి వైఎస్సార్ మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే 2009లో పార్టీకి, కార్యకర్తలకు నమ్మకద్రోహం తలపెట్టి బీఆర్ఎస్లో చేరారని దుయ్యబట్టారు.
ఆ పార్టీలో వివిధ పదవులు చేపట్టి, ఆయా శాఖల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్లో చెల్లకుండా పోయిన రాజయ్య కాంగ్రెస్లో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో చేసిన అవినీతికి ప్రజలు ఎదురు తిరుగుతారనే భయంతోనే అధికార పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యను కాంగ్రెస్లోకి తీసుకుని పార్టీని విచ్ఛిన్నం చేయవద్దని, మహిళల గౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజయ్యను పార్టీలోకి తీసుకోవద్దని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.