హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మరోసారి తన స్థాయిని మరిచి గల్లీ లీడర్లా మాట్లాడి పదవీ గౌరవాన్ని తగ్గించారని రాష్ట్ర రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బేగంపేటలో మోదీ పిట్టలదొర మాదిరి ఎప్పుడూ చెప్పే కథే మరోసారి చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై విషం చిమ్మి పోయారని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాష్ర్టానికి ఏమి ఇచ్చారో? ఏమి ఇవ్వబోతున్నారో చెప్పకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడేసరికి మోదీ తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలను అందంగా చెప్పడంలో మోదీ ఆరితేరారని సతీష్రెడ్డి ఎద్దేవాచేశారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని మోదీ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేయబోతున్నట్టు కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి ప్రహ్లాద్జోషి పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని మోదీ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సతీశ్రెడ్డి హెచ్చరించారు.