హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని కేంద్ర ఆర్థిక సర్వే-2023 ప్రశంసించింది. రాష్ట్రంలో వైద్యం కోసం చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్నదని, దేశంలోనే ప్రజావైద్యంపై అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని కితాబిచ్చింది. ఇదే సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాలు చివరి వరుసలో నిలిచాయి. ఆ రాష్ర్టాల్లో వైద్యం కోసం ప్రజల జేబులకు చిల్లు పడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రసూతి మరణాలు తగ్గాయని, తక్కువ ఎంఎంఆర్తో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వైద్యఖర్చుల్లో ప్రభుత్వ వాటా ఎక్కువే
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వైద్యం కోసం చేసిన ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వాల వాటాను గమనిస్తే.. దక్షిణ భారత దేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో వైద్యం కోసం చేసిన ఖర్చులో 40.9% ప్రభుత్వమే భరించిందని నివేదిక వెల్లడించింది. గుజరాత్ మినహాయిస్తే మిగతా బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ తెలంగాణ కన్నా దిగువనే ఉన్నాయి. డబుల్ ఇంజిన్గా పేర్కొనే ఉత్తరప్రదేశ్ 24.8 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ గణాంకాలు 2018-19 ఆర్థిక సంవత్సరానివి. ఆ ఏడాది వైద్యారోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ.6,400 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి రూ.11,400 కోట్లు కేటాయించారు. అప్పటితో పోల్చితే సుమారు 80% ఎక్కువ. ఈ ఏడాది తలసరి కేటాయింపుల్లో పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ప్రజల ఖర్చు తక్కువే..
వైద్యం కోసం ప్రజలు చేసే ఖర్చు పరంగా.. తక్కువ భారం పడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నట్టు ఆర్థిక సర్వే పేర్కొన్నది. రాష్ట్రంలో వైద్యం కోసం చేసిన మొత్తం ఖర్చులో ప్రజల జేబుల్లో నుంచి పెట్టిన వాటా 48 శాతంగా పేర్కొన్నది. పెద్ద రాష్ర్టాల్లో పరిగణనలోకి తీసుకుంటే తక్కువ ఖర్చులో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 71.3 శాతంతో అట్టడుగున నిలిచింది.
ఎంఎంఆర్లో నెరవేరిన ఎస్జీడీ లక్ష్యం..
ప్రసూతి మరణాల రేటు తగ్గింపులోనూ తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఆర్థిక సర్వే ప్రశంసించింది. 2018-19లో ఎంఎంఆర్ 43గా నమోదైనట్టు వెల్లడించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2030 సంవత్సరం నాటికి ఎంఎంఆర్ను 70 కన్నా దిగువకు తీసుకురావాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా నిర్ణయించింది. అయితే.. తెలంగాణ 2018-19లోనే ఈ లక్ష్యాన్ని సాధించిందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశంలో మొత్తం 8 రాష్ర్టాలు 70లోపు ఎంఎంఆర్ సాధించగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నది. అతితక్కువ ప్రసూతి మరణాలతో కేరళ (19), మహారాష్ట్ర (33) తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపింది. ఏపీ, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక సైతం ఎస్జీడీ లక్ష్యాన్ని అందుకున్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గడంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వంటి పథకాలు, అమ్మ ఒడి వాహనాలు వంటి కార్యక్రమాలు, ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెంచడం వంటి చర్యలు కీలక పాత్ర పోషించాయి.