హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): బైపాస్ సర్జరీ చేయించుకునే మహిళల్లో దుష్ప్రభావాలు నామమాత్రమేనని స్టార్ దవాఖాన కార్డియో థొరాసిక్, రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లోకేశ్వర్రావు సజ్జా తెలిపారు. బైపాస్ తర్వాత పురుషులతో సమానంగా మహిళల్లో 99 శాతం రికవరీ రేటు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తాము జరిపిన ‘ప్రొపెన్సిటీ మ్యాచ్డ్ ఎనాలసిస్’ అధ్యయనంలో తేలిందన్నారు. బైపాస్ తర్వాత అమెరికా, యూరప్ దేశాల్లోని స్త్రీలలో దుష్ప్రభావాల రేటు 2 నుంచి 3 శాతం వరకు ఉండగా మన దగ్గర మాత్రం ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు.
గత 20 ఏండ్లలో స్టార్, కేర్ దవాఖానల్లో కలిపి మొత్తం 13,500 బైపాస్ సర్జరీలు చేయగా, వారిలో 1825 మంది మహిళలు ఉన్నట్టు వివరించారు. బైపాస్ రోగులపై ఇంత పెద్ద సంఖ్యలో ప్రొపెన్సిటీ మ్యాచ్డ్ ఎనాలసిస్ చేయడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. బైపాస్ చేయించుకుంటున్న పురుషుల్లో 50 శాతం మంది, స్త్రీలలో 53 శాతం మంది షుగర్తో బాధపడుతున్నట్టు చెప్పారు. తమ అధ్యయన ఫలితాలు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ థోరాసిక్ అండ్ కార్డియోవాస్క్యులర్ సర్జరీ’ మే-జూన్ ఇష్యూలో ప్రచురితమైనట్టు తెలిపారు.