SSC Exams | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల లీకేజీకి కొందరు కుట్రలు పన్నిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత పటిష్ఠంగా వ్యవహరిస్తున్నది. ఇంగ్లిష్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు రంగంలోకి దిగారు. పరీక్ష మొదలైన దగ్గరి నుంచి ముగిసే వరకూ క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పోలీసులు మఫ్టీలో విధులు నిర్వర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో ముగ్గురు ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించడం, బాధిత విద్యార్థులను డిబార్ చేయడం తెలిసిందే. దీని దృష్ట్యా ఉపాధ్యాయులు బాధ్యతగా, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించారు.
99.62 శాతం హాజరు
రాష్ట్రవ్యాప్తంగా 4,85,704 మంది విద్యార్థులకుగాను 4,83, 866 ( 99.62%) మంది విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. 1,838 మంది హాజరుకాలేదు. 1,003 మంది ప్రైవేట్ విద్యార్థులకుగాను 441 మంది విద్యార్థులే పరీక్ష రాయగా, 562 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. ప్రభుత్వ చర్యలు, అధికారుల తీరుతో విద్యార్థుల్లో ఆత్మైస్థెరం పెరిగింది. ఇంగ్లిష్ పరీక్ష జరిగిన విధానాన్ని చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీపీ సార్.. సెల్ఫోన్తో పోనివ్వం!
మన్సూరాబాద్: అది హైదరాబాద్ ఎల్బీనగర్ బహుదూర్గూడలోని జిల్లా పరిషత్ పాఠశాల. స్కూల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం కూడా 9.30 గంటలకు పరీక్ష మొదలైంది. 9.40 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సిబ్బందితో అక్కడకు చేరుకొన్నారు. సెల్ఫోన్ చేతిలో పట్టుకొని హడావుడిగా స్కూల్ గేటు సమీపంలోకి రాగానే.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎల్బీనగర్ పీఎస్ మహిళా కానిస్టేబుల్ కల్పన.. ‘సీపీ సార్.. పరీక్షకేంద్రంలోకి సెల్ఫోన్ నిషేధం. సెల్ఫోన్తో ఎవ్వరినీ అనుమతించడం లేదు సార్..’ అని తెలిపారు. వెంటనే ఆయన తన సెల్ఫోన్ను ఆమెకు అప్పగించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరిశీలించారు. బయటకు వచ్చిన అనంతరం మహిళా కానిస్టేబుల్ కల్పనను సీపీ డీఎస్ చౌహాన్ అభినందించి రూ.1000 నగదు రివార్డును అందజేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ బీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అంజిరెడ్డి పాల్గొన్నారు.