హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా పోలీసుశాఖలో బదిలీలపై దృష్టిసారించింది. తాజాగా హైదరాబాద్ కమిషనర్గా అడిషనల్ డీజీ (ఆర్గనైజేషన్ అండ్ లీగల్) కొత్తకోట శ్రీనివాస్రెడ్డి(1994 బ్యాచ్)ని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి (2005 బ్యాచ్), రాచకొండ సీపీగా సుధీర్బాబు (2001 బ్యాచ్)ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడీజీ సందీప్ శాండిల్య (1993 బ్యాచ్) ను ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో’ డైరెక్టర్గా నియమించింది.
ఇప్పటివరకు రాచకొండ కమిషనర్గా ఉన్న డీఎస్ చౌహాన్ (1997 బ్యాచ్), సైబరాబాద్ కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర(1999 బ్యాచ్)ను డీజీపీ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను కూడా నేడో, రేపో కీలక పోస్టుల్లోకి బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్టీజోన్-2 ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న షానవాజ్ ఖాసీంను ముఖ్యమంత్రి సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆయన సీఎం పేషీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. అనంతరం డీజీపీ రవి గుప్తాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. మల్టీజోన్-2 ఐజీ పోస్టులో ఐజీ తరుణ్జోషీని నియమిస్తారని పోలీసు వర్గాల్లో చర్చించుకుంటున్నారు.