హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భూముల అన్యాక్రాంతంపై ఐఏఎల్ల కమిటీ సభ్యులు విచారణ వేగవంతం చేశారు. రెండు రోజుల కిందటి వరకు కొత్త, పాత రెవెన్యూ రికార్డుల దమ్ము దులిపిన అధికారులు ఇప్పటికే కొంత స్పష్టతకు వచ్చారు. బుధవారం నుంచి ఎండోమెంట్ రికార్డుల పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఓల్డ్ ఎండోమెంట్ రెగ్యులేషన్ యాక్టు- 1949, ఏపీ ఎండోమెంట్ యాక్టు- 1966 పత్రాలను కూడా ఇప్పటికే తెప్పించుకున్నట్టు తెలిసింది. 1992లో ఎండోమెంట్లో కొత్తగా ఈ దేవాలయాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు, 1925- 26 పహాణీల్లో దేవుడి భూములుగా వచ్చిన తరువాత మళ్లీ రీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ నిబంధనల ప్రకారం ఈ వ్యవహారం నడిపించారు? అనే అంశాలపై విచారణ అధికారులు దృష్టి సారించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు చైర్మన్గా ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ పురాతన రికార్డులను తీసుకురావాలని ఎండోమెంట్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ఎండోమెంట్లో తిష్ట వేసిన సీనియర్ అధికారులు కార్యాలయం నుంచి కమిటీ సభ్యుల వద్దకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ భూములకు, దేవాలయానికి సంబంధించి పురాతన రికార్డుల్లో అన్నీ సవ్యంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.. అందుకు సంబంధించిన ఆధారాలను వెతికిపట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. నిజాంకాలం నుంచి నేటి వరకు ఈ భూముల వ్యవహారంపై జారీచేసిన ఉత్తర్వులు, విచారణ కమిటీలు, కోర్టు కేసుల వివరాలను విచారణాధికారులు సేకరిస్తున్నట్టు తెలిసింది.
వణుకుతున్న అవినీతి అధికారులు
ఈ భూముల వ్యవహారంలో తలదూర్చి అందినకాడికి దండుకున్న అధికారుల వెన్నులో ఇప్పుడు వణుకు పుడుతున్నది. మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ భూముల అన్యాక్రాంతం వ్యవహారానికి సంబంధించి ఎండోమెంట్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల్లో కొందరు కబ్జాదారులతో చేతులు కలిపి రికార్డులను కూడా మాయం చేసినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పలాన రికార్డు కావాలని విచారణ అధికారులు అడగ్గానే అప్పుడు పనిచేసినవారు ఎక్కడ పెట్టారో దొరకడం లేదనే సమాధానం చెప్తున్నట్టు సమాచారం. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలతోపాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయాల నుంచి పురాతన రికార్డులను తెప్పించుకొని విచారణ అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నది.
ముత్వెల్లి నుంచి నేటివరకు..
శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం నిజాంకాలంలోనే రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆధారాలున్నాయని ఎండోమెంట్ అధికారులు పేర్కొంటున్నారు. నిజాంకాలంలోని మసీదులు, దేవాలయాలను రిజిస్ట్రేషన్ జరిగితేనే ఆనాడు ‘ముత్వెల్లి’ అనే బిరుదు ఇచ్చేవారని సీనియర్ ఎండోమెంట్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 1925- 26 రెవెన్యూ పహాణీల్లోనూ ఈ భూములకు సంబంధించిన పట్టాదారు ముత్వెల్లి రామిడిపుల్లగా రికార్డుల్లో నమోదుచేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా నిజాంకాలంలో ముత్వెల్లిగా నమోదు చేయబడినప్పటి నుంచి నేటివరకు ఈ సర్వే నంబర్లలో ఉన్న భూములు, జరిగిన వ్యవహారాలపై విచారణ కమిటీ లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.