హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు, అత్యుత్తమ ఫలితాలు సాధనకు అధికారులు మరింత శ్రద్ధ చూపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హాస్టళ్లలో ఎస్సెస్సీ చదివే వారందరిని ఒకేచోటుకు చేర్చి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్ల పనితీరుపై అధికారులతో బీఆర్కేభవన్లోని తన చాంబర్లో మంత్రి గురువారం సమీక్షించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూ రు చేసిన 15 హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చన్నీళ్లతో ఇబ్బందులు పడకుండా సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కమిషనర్ యోగితారాణా, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్ల భద్రత, సంక్షేమం, ఉపాధి, ఉన్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బోర్డును (మండలి) ఏర్పాటు చేయడమేగాక, రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. బోర్డుకు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి చైర్పర్సన్గా, సంబంధితశాఖ డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బోర్డు సభ్యులుగా నియమితులైన నవదీప్, మీరా సంఘమిత్ర, రచన, కిరణ్రాజ్, వైజయంతి వసంత, లైలా మంత్రి కొప్పులను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డులో వివిధ శాఖలకు తొమ్మిది మందిని ఎక్స్అఫీషియోగా, స్వచ్ఛంద సంస్థలకు చెంది న ముగ్గురిని సభ్యులుగా నియమించినట్టు వెల్లడించారు. బోర్డు సభ్యులు రెండేండ్లపాటు కొనసాగుతారని, ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుందని తెలిపారు.