యాదాద్రి, జూలై 5: యాదగిరిగుట్టలోని స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు విశేష పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, నిజాభిషేకం, తుల సీ సహస్రనామార్చన, కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవం, సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బా ర్ సేవలు సంప్రదాయంగా జరిగాయి. ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేశారు. వారం రోజుల స్వామివారి హుండీని మంగళవారం లెక్కించారు. రూ.59,20,615, 44 గ్రాముల మిశ్రమ బంగారం, కిలో 44 గ్రాముల మిశ్రమ వెండి, వివిధ దేశాల కరెన్సీ సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా, నిత్య ఆదాయం రూ.15,43,155 వచ్చిందన్నారు.