శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయస్వామికి (శ్రీపాదవల్లభుడు) గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. కార్తీకమాసం కావడంతోపాటు వారాంతపు సెలవులు కూడా కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చేవారు ముందస్తుగా ఆన్లైన్లో వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవల టిక్కెట్లను నమోదు చేసుకుని రావాలని కోరారు.
అదే విధంగా దర్శన సమయంలో సిబ్బందికి సహకరించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, పాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా ఉంటున్నందున సమస్యలు తలెత్తకుండ ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రతా అధికారులను సూచించారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్సీ శంభీపూర్రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఏఈవో మోహన్ స్వాగతం పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రెపాల శ్రీనివాసరావు దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా వచ్చిన వీరు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఈవో లవన్న ఎమ్మెల్సీ దంపతులకు లడ్డూ ప్రసాదాలు, విభూధి, శేషవస్త్రం, జ్ఞాపికను అందజేశారు.