న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. ఎల్ఐసీ డెత్ క్లెయిమ్స్ 17.11 శాతం పెరిగాయి. 2020-21కి ముందు మూడేండ్ల కాలంలో క్లెయిమ్స్ తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 8,16,652 డెత్ క్లెయిమ్స్ వచ్చాయి.
2019-20లో 6,97,314 డెత్ క్లెయిమ్స్ నమోదయ్యాయి. అయితే గతేడాది డెత్ క్లెయిమ్స్లో కరోనా మహమ్మారి మరణాలు ఎన్ని ఉన్నాయన్న సంగతిని ఎల్ఐసీ వెల్లడించలేదు. 2020-21 తొలి తొమ్మిది నెలల్లో వచ్చిన డెత్ క్లెయిమ్స్కు ఎల్ఐసీ రూ.16,945.96 కోట్లు చెల్లించింది.
అయితే, ఏప్రిల్-జూన్ మధ్య 1,68,301 డెత్ క్లెయిమ్స్ రికార్డయితే, సెప్టెంబర్ వరకు 4,50,849 మరణాలు సంభవించాయి. 2020 తొలి త్రైమాసికంలో దేశవ్యాప్త లాక్డౌన్ అమలులో ఉండటంతో క్లెయిమ్స్ ఫైలింగ్లో జాప్యం జరిగిందని బీమా సంస్థలు చెబుతున్నాయి.
2017 నుంచి పోలిస్తే 2020లో డెత్ క్లెయిమ్స్ పెరిగాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7,57,463 క్లెయిమ్స్ రికార్డయ్యాయి. ఆ తర్వాత 2018-19లో అది 7,15,389 క్లెయిమ్స్కు పడిపోయాయి.
భారత్లో కొవిడ్-19 తొలి వేవ్లో ఇన్ఫెక్షన్ వల్ల జరిగిన మరణాల రేటు తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో సుమారు ఐదు వేల కొవిడ్ అనుబంధ క్లెయిమ్స్ రికార్డు కాగా, ఆ సంస్థ రూ.340 కోట్లు చెల్లించింది.
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.340 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1,271 వ్యక్తులు, 542 గ్రూప్ సెటిల్మెంట్లు పూర్తి చేసింది. 2019-20 మూడో త్రైమాసికంతో పోలిస్తే 2020-21లో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో డెత్ క్లెయిమ్స్ 7,313 నుంచి 10,525కు పెరిగాయి.