నిరుపేదలకు గూడు కల్పిస్తాం
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ టౌన్, జూన్ 19: సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకు గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 2వ వార్డులో గౌడ కులస్థుల కోసం రూ.25 లక్షలతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో ప్రతి కులం వారి కోసం ప్రత్యేక ఫంక్షన్ హాళ్లు, సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.
ఇందులో ఇప్పటికే చాలావరకు భవనాలు ప్రారంభించినట్టు చెప్పారు. రైతు సంతోషంగా ఉండే గ్రామంలో అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణ రాకముందు రైతన్నలు వ్యవసాయం వదులుకొని ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లేవారని, స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి గుంటకూ నీరందిస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు వ్యవసాయంతో నిండుదనం సంతరించుకున్నాయన్నారు. బాన్సువాడ పరిధిలోని కొయ్యగుట్ట వద్ద సుమారు 14 ఎకరాల్లో 300 మడిగలు ఉండేలా ఆటోనగర్ నిర్మాణం చేపట్టన్నుట్టు ఆయన పేర్కొన్నారు.