హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాల మాడల్ను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేసే విధంగా పోరాటం చేయాలని దక్షిణ భారత రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం కేరళలోని కన్నూరు జిల్లా చెరుపూళ పట్టణంలో దక్షిణ భారతదేశ రైతుసంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలపై విసృ్తతంగా చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మాడల్ రైతు పథకాల అమలుకు కార్యచరణ రూపొందించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 19న చెన్నైలో మరోసారి సమావేశమై కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానించుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్ మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత విద్యుత్తు, పంట కొనుగోలు తదితర పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు కేంద్రంగా పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, ఖమ్మం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, తమిళనాడు నుంచి ఏఎస్ బాలు, వీఆర్ఎస్కే సెంథిల్ కుమార్, వీ స్వామినాథ్, కర్ణాటక రైతు రాజ్య అధ్యక్షుడు బసవరాజ్, కేరళ నుంచి జోసఫ్ యం పుత్తుసేరి పాలుపంచుకున్నారు.