కొత్తకోట: కడుపులో నలుసు పడిందని తెలియగానే తల్లి మనసు ఉప్పొంగుతుంది. నెలలు గడుస్తున్నా కొద్దీ తాను తల్లి కాబోయే క్షణాలు దగ్గరపడుతున్నాయన్న ఆనందంతో మురిసిపోతుంది. పురిటినొప్పులతో తల్లడిల్లినా బిడ్డను కళ్లజూడగానే ఆ బాధను మరిచిపోతుంది. ఆ తర్వాత బిడ్డను ఆడిస్తూ, జోల పాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. బిడ్డ తప్పటడుగులు వేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బవుతుంది. నత్తినత్తి మాటలు మాట్లాడుతుంటే పట్టలేని సంతోషంతో పొంగిపోతుంది. బిడ్డకు ఏ ఆపదొచ్చినా తన ప్రాణం పోతున్నట్టుగా విలవిల్లాడుతుంది. అలాంటి అమ్మ మనసు తెలిసిన ఎవరైనా ఆఖరి రోజుల్లో కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పసిబిడ్డలా చూసుకుంటారు. కానీ, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, అమడబాకుల గ్రామంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.
కన్న పేగే కనిపెంచిన తల్లిపాలిట యమపాశమైంది. నవమోసాలు మోసి కన్న కొడుకే కాల యముడయ్యాడు. కన్న తల్లి అనే కనికరం కూడా భార్యతో కలిసి కడతేర్చాడు. ఆపై శవాన్ని ఇంటి సమీపంలో ఉన్న ఓ నీటి సంపులో పడేశాడు. దాంతో మానవత్వం అనే పదానికే మాయని మచ్చగా మిగిలాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోట మండలం, అమడ బాకుల గ్రామానికి చెందిన శంకరమ్మ (64)కు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. బిడ్డల పెళ్లిళ్లయ్యి అత్తగారిళ్లకు వెళ్లారు.
శంకరమ్మ కొడుకు రాములు, కోడలు శివమణితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల శంకరమ్మ మంచం పట్టింది. ఆమెకు అన్ని సపర్యలు మంచం మీదే చేయాల్సి వచ్చింది. శంకరమ్మ దుస్థితి కొడుకు, కోడలులో జాలికి బదులుగా ఉక్రోషాన్ని పెంచింది. దాంతో సోమవారం అర్ధరాత్రి రాములు తన భార్య శివమణితో కలిసి తల్లి శంకరమ్మను అత్యంత అమానవీయంగా హత్య చేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి శవాన్ని ఇంటి సమీపంలోని నీళ్ల సంపులో పడేశారు.
మంగళవారం శంకరమ్మ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు అంతా వెతికారు. దాంతో రాములు ఇంటి సమీపంలో ఉన్న సంపులో శంకరమ్మ శవమై కనిపించింది. కొడుకు, కోడలును అనుమానించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. దాంతో రాములు, శివమణి ఇద్దరికీ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ నాగశేఖర్రెడ్డి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంపులో నుంచి శవాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం కోసం వనపర్తి దవాఖానకు పంపించారు.