Somesh Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ (Somesh Kumar) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సోమేశ్ కుమార్కు అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
సోమేశ్కుమార్ 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కలెక్టర్ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్గా సేవలందించారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.