హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ రహదారుల మూసివేతపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ఆ రహదారులను మూసివేయటం వల్ల చుట్టుపకల కాలనీల్లోని వేలమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్భట్కు ఉపరాష్ట్రపతి తెలిపారు. సమస్యను పరిశీలించాలని మంత్రికి సూచించారు. ఇదే సమస్యపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్కు రాసిన లేఖ గురించి కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సహాయమంత్రిగా నూతనంగా నియమితులైన అజయ్భట్.. ఆదివారం ఉపరాష్ట్రపతిని ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ సమస్యను వెంకయ్య ప్రస్తావించటంతో వెంటనే పరిశీలించి, తెలియజేస్తామని అజయ్భట్ చెప్పారు.