హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకే బీజేపీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నదా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఎనిమిది రాష్ర్టాల్లో తమ ప్రభుత్వాలను ఏ దారిలో ఏర్పాటు చేశారో బదులివ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం ఎలా? ప్రభుత్వాలను కూల్చటం ఎలా? అనే అంశంపైనే బీజేపీ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే స్థితిలో లేకపోవడంతో అధికారంలో ఉన్న పెద్ద నాయకులను తిట్టడం ద్వారా లబ్ధి పొందాలనే నీచ సంస్కృతికి బీజేపీ తెరతీసిందని దుయ్యబట్టారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో టీఆర్ఎస్కు, బీజేపీకి స్పష్టమైన తేడా ఉన్నదని చెప్పారు.
ప్రభుత్వాల కూల్చివేతలు, కుట్రలు, కుతంత్రాల కోసం బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంటే.. తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం తాము టీఆర్ఎస్లో చేరామని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అధికారం కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోలేదనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలని హితవు చెప్పారు. తమ చేరికలతోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడలేదని గుర్తుచేశారు. 10వ షెడ్యూల్ ప్రకారం తాము చట్టబద్ధంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశామని వివరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పదవికి రాజీనామా చేసిన అనంతరమే చేర్చుకున్నామని చెప్తున్న బీజేపీ నేతలు.. ప్రభుత్వాలను కూల్చిన ఎనిమిది రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు. హిందూ మతానికి తామే పేటెంట్ అయినట్టు బీజేపీ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ మాదిరిగా దైవభక్తిని రాజకీయాల కోసం వాడే కుసంస్కారం తమకు లేదని చెప్పారు. కాంగ్రెస్ కాలానుగుణంగా అదృశ్యమయ్యే పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ తమకు ఇచ్చిన సమన్లపై న్యాయపరంగా స్పందిస్తామని చెప్పారు.