మహబూబ్ నగర్ : జిల్లాలోని మహ్మదాబాబాద్ పీఎస్ పరిధి కంచన్ పల్లి గ్రామంలో గతేడాది (2020) ఫిబ్రవరిలో జరిగిన ఒక లైంగిక దాడి సంఘటనలో నిందితుడు గున్ని పెంటయ్య (44 ) కు ఇరవై సంవత్సరాల కారాగార శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రఘునాథరెడ్డి ఇవాళ తీర్పు వెలువరించారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మహ్మదాబాద్ పీఎస్ పరిధిలోని కంచన్ పల్లి గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవించే గున్ని పెంటయ్య తన సొంత కూతురుపై లైంగికదాడికి పాల్పడగా..బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కేసు అత్యంత తీవ్రమైనదిగా భావిస్తూ నిందితుడికి ఇరవై సంవత్సరాలు కారాగార శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
సంచలనం సృష్టించిన ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంజులాదేవి వాదించగా మహబూబ్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ డి.కె.మహేశ్వర్ పరిశోధన అధికారిగా ఉన్నారు. కానిస్టేబుళ్లు ఎం.డి.నజీర్, కోర్టు విధులు, నిరంజన్ గౌడ్ కోర్టు లైజన్ అధికారిగా ఉన్నారు. కేసు పరిశోధన, నిందితుడికి తగిన శిక్ష పడటంలో విధులు నిర్వహించిన అధికారులను ఎస్.పి. రెమా రాజేశ్వరి అభినందించారు.