కొడకండ్ల, అక్టోబర్ 10: కొందరు యువకులు పంపిన ట్విట్టర్ పోస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెంటనే స్పందించారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రేగుల గ్రామానికి చెందిన బల్ల రాజు(28) ఈ నెల 8న రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాజకు భార్య, 6 నెలల బాబు ఉన్నాడు.
అనారోగ్యంతో తల్లిదండ్రులు ఉన్నారు. ఇటీవలే రాజు తండ్రి యాకయ్య నడుముకు సంబంధించిన మేజర్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తల్లిదండ్రులను చూసుకునే కుమారుడు ఆకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. రాజు తల్లిదండ్రులు, భార్య, 6 నెలల బాబు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కాగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ దృష్టికి ట్విట్టర్ ద్వారా రాజు కుటుంబ దీన గాథను పోస్ట్ చేశారు. వెంటనే స్పందించి ఆదుకోవాలని కార్యాలయ అధికారులను స్మితా సబర్వాల్ ఆదేశించారు. స్పందించిన అధికారులు రాజు తండ్రి, కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్యబృందాన్ని రేగులకు పంపి యాకయ్యకు సంబంధించిన వైద్య పరమైన వివరాలు సోమవారం సేకిరించారు. ఫిజియోథెరపీ ప్రతి 15 రోజులకొకసారి ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తామని డాక్టర్లు తెలిపారు.