ఖమ్మం : శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కల్యాణ ఉత్సవం, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై మంత్రి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు.
10న జరగనున్న రాములవారి కల్యాణం, 11న పట్టాభిషేకం నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతారామ కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే అశేష భక్తజన కోటికి సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కళ్యాణంను ఆలయంకే పరిమితం చేసినందున, ఈ మహోత్సవాలకు ఈ సారి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున 3 లక్షల స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా..సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణంకు చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఎర్పాటు చేయాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 8వ తేదీ కల్లా పూర్తచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సూచికలు, కల్యాణం ప్రాంగణ వివరాలు, వివిధ సేవలకు సంబంధించిన పలు అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి కల్యాణం జరిగే చోటు అయిన మిథిలా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.