TSPSC | హైదరాబాద్ : గ్రూప్-1( Group -1 )తో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం( SIT ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు టీఎస్పీఎస్సీ( TSPSC ) కార్యదర్శి అనితా రామచంద్రన్( Anitha Ramachandran ), సభ్యుడు లింగారెడ్డికి( Lingareddy ) సిట్ నోటీసులు జారీ చేసింది. అవసరమైతే ఛైర్మన్తో పాటు మిగతా వారికి కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఏఈ పోటీ పరీక్ష ప్రశ్నా పత్రాలతో పాటు మరో నాలుగు పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో ప్రధాన నిందితులు కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డిలు. ఈ ఇద్దరిని విచారించడంతో మాజీ ఉద్యోగి ప్రవీణ్, అందులో పనిచేసే రమేష్, షమీమ్లకు కూడా గ్రూప్-1 పేపర్ అందించినట్లు వెల్లడించారు.
కార్యదర్శి పీఏగా ప్రవీణ్, కమిషన్ సభ్యుడు బండి లింగారెడ్డికి పీఏగా రమేశ్ పని చేశారు. దీంతో ముందుగా కార్యదర్శి, కమిషన్ సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి ఆయా నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు. అలాగే కమిషన్ ఛైర్మన్, మిగతా సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసి టీఎస్పీఎస్సీ విధి విధానాలు, అక్కడి సిబ్బంది విధులు, ఎన్ని విభాగాలున్నాయి, ఎవరెవరు ఎప్పటి నుంచి ఆయా పోస్టులలో ఉన్నారు, అరెస్టు అయిన నిందితులు ఆయా విభాగాలలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే కీలకమైన స్టేట్మెంట్ను తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా సురేష్, రమేష్, షమీమ్ల మూడో రోజు కస్టడీ పూర్తయ్యింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని, కాల్ డేటాల ఆధారంగా సిట్ నిర్ధారించుకొని, వాళ్లు చెప్పే విషయాలలో ఎంత వరకు వాస్తవాలున్నాయని నిర్ధారించుకుంటున్నారు. మరో రెండు రోజులు నిందితులు సిట్ కస్టడీలో ఉండనున్నారు. మరో పక్క ఏఈ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల అరెస్టు అయిన ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయస్థానాన్ని కోరింది.