నాంపల్లి కోర్టులు, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు వరుసకు అల్లుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ సూచన మేరకు తాము సహకరించామని ఈస్ట్ గోదావరికి చెందిన సోదరులు జానిపల్లి రవికుమార్, శ్రీనివాస్రావు, బంధువు మడికి కాంతారావు సిట్ అధికారుల రిమాండ్ కేసు డైరీలో వివరించారు. ఏఈ పరీక్ష రాసేవారిని తమ బంధువైన కాంతారావు ఇంటికి తీసుకెళ్లాలని తమకు తెలిపినట్టు నిందితులు సిట్ అధికారుల ఎదుట ఒప్పుకొన్నారు. అందుకోసం ప్రవీణ్ తమకు రూ.3 లక్షలు ఇచ్చాడని తెలిపారు. ముగ్గురి తరఫున న్యాయవాది బెయిల్ పిటీషన్లను దాఖలు చేశారు. శుక్రవారం సిట్ పీపీ చందు కౌంటర్ దాఖలు చేశారు. వాదనల కోసం సోమవారానికి వాయిదా వేస్తూ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రిమాండ్ ఖైదీలుగా చంచల్గూడ జైలులో 150 రోజులు పూర్తి చేసుకున్నారు.