హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సిక్కిం మంత్రి కలిశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి లోకనాథ శర్మకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
అనంతరం సిక్కిం మంత్రి లోకనాథ శర్మ మాట్లాడుతూ.. పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సిక్కిం రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకొన్నాను అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్ధికంగా ఎంతో అభివృద్దిని సాధిస్తుంది అని పేర్కొన్నారు. కృత్రిమ గర్బధారణ కార్యక్రమం వలన మేలుజాతి పశుసంపద ఉత్పత్తి జరుగుతుంది. ఇది పాడి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ శర్మ అన్నారు.