SI Firing | దొంగల ముఠా కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ.. అందులోని కాపర్ తీగను ఎత్తుకువెళ్తున్నారు. ముఠాతో రైతులతో పాటు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఠాను పట్టుకునేందుకు రెండు నెలలుగా పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఠా సంచరిస్తున్నట్లుగా పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దాంతో టాస్క్ఫోర్స్, సీసీఎస్, ధర్పల్లి సీఐలతో పాటు డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, ధర్పల్లి ఎస్ఐలు, సిబ్బంది ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రిజిస్ట్రేషన్ పేరిట ఉన్న కారును ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆపే ప్రయత్నం చేశారు. దాంతో బారికేడ్లను ఢీకొట్టుకుంటూ కారు ఎస్ఐపైకి దీసుకువచ్చింది. దాంతో ఆయన వెంటనే ఆత్మరక్షణ కోసం గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఆ తర్వాత పోలీసులు కారును వెంబడించగా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లుపేట వద్ద కారు వదిలేసి పారిపోయారు. దొంగల కోసం పోలీస్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. దొంగల ముఠాను రాజస్థాన్కు చెందిందిగా అనుమానిస్తున్నారు. పోలీసులు మల్లుపేటకు చేరుకొని కారును స్వాధీనం చేసుకొని ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఆ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదైంది.