హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు శ్రమజీవి పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పార్టీ తరపున భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామినేషన్లను సమర్పించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ నామినేషన్ల పరిశీలన గడువు నేటితో ముగిసింది. అయితే శ్రమజీవి పార్టీ అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో.. ఆ రెండింటిని తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉంది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.