కరీంనగర్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్రావే కారణమంటూ ఆ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఈనెల 1న టీపీసీసీ క్రమశిక్షణ సంఘం (డీఏసీ)కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. తనకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు నరేందర్రెడ్డి కోటి రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు.
అందులో భాగంగా ఓ ప్రజాప్రతినిధి ముందే ఆయనకు రూ. 20 లక్షలు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతా చేస్తే వారిద్దరూ తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి నాలుగైదు రోజుల క్రితం నరేందర్రెడ్డి, రోహిత్రావుకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారిద్దరూ వివరణ ఇస్తూ శ్రీనివాస్ ఓటమికి ఆయనే కారణమని తగిన ఆధారాలను అధిష్ఠానానికి అందించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన క్రమశిక్షణ సంఘం పురమల్లకు షోకాజ్ నోటీసు జారీచేసింది.