హైదరాబాద్, జూన్ 6: గుండె నొప్పితో బాధపడుతూ ఏఐజీ దవాఖానలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం అండగా నిలుస్తున్నది.. శుక్రవారం ఉదయం కేటీఆర్ సతీమణి శైలిమ హాస్పిటల్కు చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. గోపినాథ్ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్కు తెలియజేశారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటిలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ ఏఐజీ దవాఖానకు తరలించారు. కార్డియాక్ అరెస్ట్కు గురైనట్టు గుర్తించి సీపీఆర్ చేయడంతో ఆయన కొద్దిగా కోలుకున్నట్టు ఏఐజీ వైద్యులు తెలిపారు. అనంతరం గుండె నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో వెంటిలేటర్పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే గోపీనాథ్ పరిస్థితి కొంత విషమంగానే ఉన్నదని, 48 గంటలు గడిచేవరకు ఏ విషయం చెప్పలేమని తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ ఏఐజీలోనే డయాలసిస్ చేయించుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.