కవాడిగూడ, ఆగస్టు 25: సీమాంధ్ర మూలాలు ఉన్న బసవరాజు శ్రీనివాస్ను తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని పలువురు వక్తలు, బ్రాహ్మణ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలంగాణ గీత పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, నైషధం సత్యనారాయణమూర్తి తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలపై నేటికీ వలసదారుల పెత్తనం కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలతో కలసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పటికీ సరైన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఓ సమావేశంలో బసవరాజు శ్రీనివాస్ దళిత మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి రమణారావు, యజ్ఞం పవన్కుమార్శర్మ, ప్రసాదరావు, రామారావు, రాజేశ్వరరావు, రమణారావు, కిరణ్, రమణ, ప్రశాంత్శర్మ, వేణుగోపాల్శర్మ పాల్గొన్నారు.