హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ను రద్దుచేసి, జాతీయ స్థాయిలో ఉమ్మడి ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఐఐటీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలి ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, పలు ఐఐటీల డైరెక్టర్లు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్టు తెలిసింది. నీట్ తరహా జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించి, ర్యాంకులతో సీట్లు భర్తీచేసే విధానాన్ని అమలుచేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఒకే రకమైన కోర్సుకు మూడుకుపైగా ప్రవేశ పరీక్షలుండటంతో విద్యార్థులకు భారంగా మారుతున్నదని కేంద్ర వర్గాలంటున్నాయి. నిరుడు అన్ని సెంట్రల్ వర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిచేందుకు కేంద్రం సీయూఈటీని ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో ఉమ్మడి పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించడం ఉత్తమమని కేంద్ర విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రాభవాన్ని కోల్పోయే అవకాశం..
ప్రస్తుతం జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్కు వేర్వేరు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఎంసెట్తోపాటు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్, ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. జాతీయస్థాయిలో కామన్ ఎగ్జామ్ పెడితే జేఈఈ అడ్వాన్స్డ్ రద్దవుతుంది. ఉమ్మడి పరీక్షకు జాతీయంగా విద్యార్థులంతా హాజరవుతారు. ఈ ఫలితాలు ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ర్టాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లను భర్తీచేస్తారు. ఈ విధానాన్ని చాలా మంది ఐఐటీల డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. సాధారణ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లకు, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీట్లను ఒకేగాటన కట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఐఐటీలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో భాగమైతే వాటి ప్రత్యేకతను, ప్రాభవాన్ని కోల్పోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఐఐటీ ఢిల్లీని సమీక్షించి, నివేదిక ఇవ్వాలని కోరగా, ఇంత వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఓ నిపుణుల కమిటీని వేసే ఆలోచనలో కేంద్ర విద్యాశాఖ ఉన్నట్టుగా తెలుస్తున్నది.