హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటలను నాశనం చేస్తున కోతులకు విరివిగా సంతాన నిరోధక ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే కోతులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కోతుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఆయన బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోతుల బెడద నివారణకు వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకొన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ శోభ, వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు, వెటర్నరీ వర్శిటీ వీసీ డాక్టర్ రవీందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పురపాలకశాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.