హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ విద్యుత్తు ఉద్యోగుల విభజన వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏపీ నుంచి వచ్చిన విద్యుత్తు ఉద్యోగుల జీతాలు, సీనియారిటీ, పదోన్నతుల విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ తెలంగాణ విద్యుత్తు సంస్థల యాజమాన్యం సోమవారం నివేదిక సమర్పించింది. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తెలంగాణ విద్యుత్తు సంస్థలు నెరవేర్చాయని, తమకు ఏ విధమైన అభ్యంతరాలూ లేవని ఏపీ విద్యుత్తు ఉద్యోగుల తరఫు న్యాయవాది గోపాల్రావు తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ షా, జస్టిస్ రవీంద్రభట్ ధర్మాసనం.. తెలంగాణ విద్యుత్తు సంస్థలు కోర్టు తీర్పును అమలు చేసినట్టుగా రికార్డు చేసి, కేసును ముగించింది.