హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా అనధికారికంగా జరుగుతున్న గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) కిట్ల విక్రయాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలతోపాటు ఇకపై చేపట్టే కార్యాచరణ ఏందో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో 234 మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా ఎంటీపీ కిట్లను విక్రయిస్తున్నాయని ఔషధ నియంత్రణ శాఖ గుర్తించినట్టు న్యాయస్థానం దృష్టికి రావడంతో మంగళవారం ఈ ఆదేశాలు జారీచేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.