హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ ప్రారంభం కావడం, కొన్నిచోట్ల పైరుకు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా ఉల్లికోడు, గొట్టపురోగం, దుంపరోగం, రాగి గొట్టాల వంటి తెగుళ్లు సోకి పైరును ఎదగకుండా చేస్తున్నదని రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్సియోలియా ఒరైజే అనే పురుగు వల్ల ఈ తెగుళ్లు ఏర్పడతాయని వ్యవసాయ విస్తరణ పరిశోధన శాస్త్రవేత్త ఆర్ జగదీశ్వర్ వెల్లడించారు. జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో ఈ తరహా తెగుళ్లు సోకుతున్నాయని పేర్కొన్నారు.
ఉల్లికోడు పెద్ద పురుగులు పసుపు లేదా ముదురు ఎరుపు రంగులో దోమ వలె ఉంటాయి. ఇవి ప్రధానంగా నారుమడి లేదా పిలకదశలో సోకి తీవ్రనష్టం కలుగజేస్తాయి. వానకాలంలో ఆలస్యంగా నాటిన వరిపైర్లకు ఈ పురుగులు సోకి సుమారు 30-70 శాతం దిగుబడి రాకుండా చేశాయి.
యాసంగిలో కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పిలకదశలో ఉన్న యంటీయు 1010, గంగా కావేరి రకం వరి పైరును ఈ తెగులు ఆశిస్తున్నది. ఆర్ఎన్ఆర్ 15048, బీపీటీ 5204, పూజ, హెచ్ఎంటీ, సోన వంటి రకాల్లో కూడా ఆశించవచ్చు.