Minister Indrakaran Reddy | హైదరాబాద్ : సమగ్ర అభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ కీలకమని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి (టీఎస్ కాస్ట్) మూడో కార్యనిర్వాహక సమావేశం జరిగింది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎస్ కాస్ట్ తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రటరీ ఎం.నగేశ్ వివరించారు.
భౌగోళిక సూచికాల మేధో సంపత్తి పరమైన హక్కు పత్రాల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు సాంకేతికతను సామాజికంగా వినియోగించుకోవడం- రాష్ట్ర సంస్థలు వాటిని అడాప్ట్ చేసుకోవడం, విద్యార్థుల్లో సైన్స్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం, విశ్వ విద్యాలయాలతో సమన్వయం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2021-22 & 2022-23 సంవత్సరాలలో రూ. 15.14 కోట్ల గ్రాంటును ఇన్నోవేషన్ హబ్, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్మెంట్, SC – ST సెల్, పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (PIC), నేషనల్ సైన్స్ డే & నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (NCSC) కార్యక్రమాల వెచ్చించామని మెంబర్ సెక్రటరీ వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని, టెక్నాలజీ లేని ప్రపంచాన్ని ఊహించలేమని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపర్చేందుకు, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలితో సమన్వయం చేసుకుంటూ టీఎస్ కాస్ట్ పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రజల సామాజిక – ఆర్థిక పరిస్థితుల ఆధ్యాయనానికి శాస్త్రీయ పరిశోధనలు ఉపయోగించుకోవాలని సూచించారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వ సహయసాకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. మూఢ నమ్మకాలపైనే కాకుండా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా సైంటిస్టులు దృష్టి సారించి, వాటిని అధిగమించడానికి తగు సూచనలు ఇవ్వాలన్నారు. అప్పుడే ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న మూఢ నమ్మకాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
టీఎస్ కాస్ట్ పనితీరు బాగుందని, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తుందని, ఆరోగ్యం, పర్యావరణం, జీవవైవిధ్యం, వ్యవసాయ రంగాలలో 25 పరిశోధన ప్రాజెక్టులను TSCOST ద్వారా మంజూరు కావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.