Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుపుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణవాదులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తెలంగాణ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలతో నగర గోడలపై పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ ఇవ్వబోయే ఆరు హామీలు ఇవేనంటూ మరో ఝలక్ ఇచ్చారు. ఆ ఆరు గ్యారంటీలు ఒకటి అవినీతి, కుంభకోణాలు, రెండోది కరెంట్ కష్టాలు, మూడోది శాంతి భద్రతల వైఫల్యం, నాలుగోది అబద్ధపు హామీలు, ఐదోది అంతర్గత కొట్లాటలు, ఆరోది ఢిల్లీ చేతిలో తెలంగాణ పగ్గాలు అంటూ ఎద్దేవా చేశారు.
ఇక శనివారం సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్న సోనియాని ఉద్దేశించి గతంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పోస్టర్లు వెలిశాయి. ‘సోనియా గాంధీ తెలంగాణ బలిదేవత’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ర్టాల నేతలు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి నేర్చుకొని వెళ్లండి అంటూ వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి.