హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శి(సీఎస్)గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా ప్రభుత్వం ఆయనను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించింది. ఈ మేరకు 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సీఎస్ రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టులోనే రిటైర్ కావాల్సి ఉన్నది.
సీఎం రేవంత్ ప్రత్యేక వినతులతో ఆయన ఉద్యోగ కాలం పొడిగింపునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జూలై ఒకటి నుంచి ఆయన సీఎం సలహాదారుగా కొనసాగనున్నారు. ఆయన స్థానంలో నియమితులైన 1992వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు, కేంద్ర సర్వీసు నుంచి ఇటీవలే తెలంగాణ క్యాడర్కు తిరిగి వచ్చారు. ఆయన కేరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఏపీలోని విజయవాడ సబ్కలెక్టర్గా, పశ్చిమగోదావరి కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, కమిషనర్గా పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్జాజును కేంద్రం తెలంగాణకు పంపుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రధానకార్యదర్శి పోస్టుకు సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరును కూడా సీఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. చివరికి సంజయ్ జాజు వైపే మొగ్గు చూపారు. పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక సీఎస్గా, సీఎంవోలోని స్పీడ్ విభా గం సీఈవోగా, పరిశ్రమలు-పెట్టుబడుల విభా గం ప్రత్యేక కార్యదర్శిగా జాజుకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది.
వివాదాస్పద నిర్ణయాలకు, అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సీఎం కార్యదర్శి అజిత్రెడ్డిని ఎట్టకేలకు సీఎంవో నుంచి సాగనంపారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ను నియమించారు. కేంద్ర డిఫెన్స్ సర్వీస్లో ఉన్న అజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి ఏరికోరి డిప్యుటేషన్ మీద రాష్ర్టానికి తీసుకొచ్చి ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించారు. ఐడీఈఎస్ 2012 బ్యాచ్కు చెందిన ఈ అధికారి సికింద్రాబాద్ కంటోన్మెంట్బోర్డులో పనిచేస్తున్న సమయంలో రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. అప్పటినుంచే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలిసింది. అనుభవరాహిత్యం, సీఎంవోకు బ్యూరోక్రాట్లతో సమన్వయం లేకపోవటం, ఆర్థికపరమైన అంశాలలో తలదూర్చటం తదితర ఆరోపణలతో సీఎం ఆయన ను తన పేషీ నుంచి బయటికి పంపించారనే ప్రచారం జరుగుతున్నది. అజిత్రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా ట్రాన్స్ఫర్ చేసింది.
వీరితో పాటు 13మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సభ్యసాచి ఘోష్కు హ్యాండ్ల్యూమ్, టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. శైలజా రామయ్యర్ను అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అహ్మద్ నదీమ్కు పొలిటికల్ (జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. రాహుల్ బొజ్జాకు ప్రకృతి విపత్తుల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఎం రఘునందన్రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. కాత్యాయనీదేవిని హ్యాం డ్లూమ్,్స హ్యాండీ క్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. కే గంగాధర్ను ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా బదీలీ చేసింది. టీ వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, కే విద్యాసాగర్ను టూరిజం డైరెక్టర్గా నియమిస్తూ ఉత్వర్వులు జారీచేసింది.