ఏటూరునాగారం, జూన్ 22 : గోదావరి నది భూగర్భ జలాల ధ్వంసం కోసమే ఇసుక మాఫీయా డీ సిల్టింగ్ పేరుతో కుట్రలు పన్నుతున్నదని, గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అధికార పార్టీ నేతలపై పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇసుక లారీలు అర్ధరాత్రి విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడో కట్టే సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ స్టోరేజ్ ఏటూరునాగారం వరకు విస్తరించి ఉంటుందని తప్పుడు నివేదికలు సమర్పించి డీసిల్టింగ్ పేరుతో కొత్త క్వారీలకు అనుమతి ఇచ్చి వనరులు ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్ల ప్రలోభాలకులోనై పర్యావరణ, భూగర్భ శాఖ అధికారులు వినాశన అనుమతులు మంజూరు చేశారని మండిపడ్డారు. సొసైటీ యాక్టు ప్రకా రం కూలీలతోనే తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా రోడ్డుపైకి చేర్చాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా యంత్రా లు గోదావరిలోకి వెళ్లి లారీల్లో నింపుతున్నాయని ఆరోపించారు. మాఫియా ఆగడాలపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ప్రకటించారు.