హైదరాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది. మినీ జాతర నేటినుంచి ప్రారంభంకానుంది. సమ్మక్క-సారక్క పూజారులు మండమెలిగే పండగ (మినీ జాతర)ను నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండ మెలిగే పండగను నిర్వహించనున్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలి వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క సారలమ్మ తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.
కాగా, మండ మెలిగే పండుగను పురస్కరించుకొని పూజారులు ఆయా గ్రామాల్లో గ్రామదేవతలు, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా పూజారులు బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మామిడి ఆకులతో పాటు కోడి పిల్లను కట్టి తోరణాలు కడతారు. పూజారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సమ్మక్క-సారలమ్మ పూజామందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మినీ జాతర ముగిసే వరకు అమ్మవార్లకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అత్యంత నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తారు.
బుధవారం రాత్రి తల్లుల పూజారులు రాత్రంతా గద్దెల వద్ద జాగారం చేసి ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీ జాతర ప్రారంభమవుతుంది. తల్లులను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మహాజాతర సందర్భంగా అమ్మవార్లకు జరిగే పూజలు యథావిదిగా సాగుతాయి. బుధ, గురు, శుక్రవారాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపర్చడంతో మినీ జాతర ముగుస్తుంది.
పుణ్యస్నానాలకు ఏర్పాట్లు
అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో బ్యాటరీ ఆఫ్ట్యాప్స్ను ఏర్పాటు చేశారు. జంపన్నవాగుపై గల జంట వంతెనలకు ఒకవైపు రూ.11.70 లక్షలతో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్నానఘట్టాలపై 350కి పైగా షవర్లను బిగించారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు రేకులతో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. ఇన్ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. చర్మ సమస్యలు తలెత్తకుండా బ్లీచింగ్ లిక్విడ్ను నీటిలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు.