హుజూరాబాద్, అక్టోబర్ 6: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి గురించి నిరంతరం తపనపడుతుంటే.. ఈటల రాజేందర్ మాత్రం ఆస్తులు ఎలా కూడగట్టాలనే ఆలోచనచేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయాలని హుజూరాబాద్ పట్టణ ప్రజలు ఈటల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్లో రూ.6 కోట్లతో చేపట్టిన సైదాపూర్ రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడేండ్లు మంత్రిగా ఉండి సైదాపూర్కు వెళ్లే రహదారిని సైతం పట్టించుకోని ఈటలకు ఓటేందుకు వేయాలని ప్రశ్నించారు. స్వప్రయోజనాలు, పేదల భూములను లాకోవడం మినహా ఏ రోజూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్ అభివృద్ధిని బాధ్యతగా తీసుకొని జిల్లా మంత్రిగా తాను, హరీశ్రావు చేసిన విజ్ఞప్తితో తక్షణమే దాదాపు రూ.70 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. 350 రహదారుల్లో సగానికిపైగా పనులు జరుగుతుండగా, 50 వరకు పూర్తయ్యాయని వివరించారు.
బీజేపీ ప్రైవేట్ కంపెనీల పార్టీ
బీజేపీ ప్రైవేట్ కంపెనీల పార్టీ. బడా వ్యాపారుల ప్రయోజనం కోసం పని చేస్తున్నదే తప్ప, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్లో రైతులను కారుతో తొక్కించిన ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. బీజేపీది అధికార ధ్యాస తప్ప, ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్.. అనేక సార్లు బీజేపీని తిట్టిపోశారు. ఇప్పుడు అదే పార్టీలో చేరారు. ప్రజులు ఇది గమనించాలి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలి.
– పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే
నల్లచట్టాలపై మాట్లాడకుండా ఓట్లు అడుగుతారా?
బీజేపీ నాయకులు రైతు వ్యతిరేక చట్టాల గురించి మాట్లాడకుండా ఓట్లు అడుగడాని కి ఎలా వస్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాలవారికి కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రతి దళిత కుటుంబానికి దళిబంధువు వస్తుంది. కొంత మంది దళిత వ్యతిరేకుల అసత్యప్రచారాలు నమ్మవద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుంటే, బీజేపీ ప్రజల డబ్బును దోచుకుంటున్నది. అభివృద్ధి చేసే ప్రభుత్వనికి ప్రజలు మద్దతుగా నిలువాలి.