కులకచర్ల, జూలై 23: మహిళా రైతు నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసినవారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పుట్టపహడ్ గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్, ప్రధాన నిందితుడు రాఘవేందర్రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. రైతుబీమా సొమ్ము కొట్టేసిన వ్యవహారంలో కొడంగల్ ఏడీఏ వినయ్కుమార్ శుక్రవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహడ్లో విచారణ చేపట్టారు. పంచాయతీ రికార్డులను పరిశీలించారు. బాధితురాలు చంద్రమ్మ, ఆమె కుమారుడు బాలయ్య నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాఘవేందర్రెడ్డితోపాటు వ్యవసాయ కార్యాలయానికి వచ్చి సంతకం చేసిన బాలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేందర్రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తును పరిశీలించి.. విచారణ చేపట్టకుండానే రైతుబీమా సొమ్ముకు సిఫారసు చేసిన క్లస్టర్ ఏఈవో సత్తార్ను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ తెలిపారు.